Akshaya Tritiya: నేటికాలంలో అక్షయ తృతీయ అనగానే బంగారం లేదా
వెండి కొనడం మాత్రమే అని ప్రచారంలో ఉంది. అక్షయ తృతీయ రోజున కొన్నది అక్షయం
అవుతుందని చెప్పిన మాటను వ్యాపారవేత్తలు
ప్రచారంగా వాడుతున్నారు. ఈ మాటలని నమ్మి బంగారం, వెండి కొనటం
ఒక ఆనవాయితీగా మారింది.
Akshaya Tritiya ప్రాముఖ్యత
అక్షయ తృతీయ వైశాఖ మాసం
శుక్షపక్షంలో 3వ రోజున వస్తుంది. ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీమహాలక్ష్మీ
దేవిని అందరూ భక్తిశ్రద్దలతో పూజిస్తారు. చాలా మంది ఈ రోజు బంగారాన్ని కొంటారు.
అక్షయం అంటే తరిగిపోనిది అని అర్ధం. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట
కొలువు తీరుతుందని చాలా మంది నమ్మకం.
![]() |
బంగారం కొనడం |
భూలోకంలో బంగారం మొదట గండకీ నదిలోని సాలగ్రమాల గర్భం నుండి వైశాఖ శుద్ద
తదియనాడు ఆవిర్భవించింది. బంగారం ఉద్భవించిన ఈ రోజునే అక్షయ తృతీయగా జరుపుకుంటారు.
బంగారానికి 'హిరణ్మయి'
అనే పేరు ఉంది. 'హిరణ్య గర్భో భూగర్బో మాధవో మధుసూద నః' అని విష్ణు
సహస్రనామంలో ఉంది. 'విష్ణువు' హిరణ్యగర్భుడు.
అంటే 'గర్భం నుందు బంగారం కలిగిన వాడని' అర్థం. బంగారం విష్ణువుకు ప్రతి రూపం. అందుకే బంగారం పూజనీయమైనది.
Akshaya Tritiya రోజు బంగారమే ఎందుకు కొంటారు
అక్షయం అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది. కాబట్టే Akshaya Tritiya రోజు ప్రతి ఒక్కరు నగలు, భూములు కొనడం మరియు ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం వంటివి చేస్తారు. ఎక్కువగా అక్షయ తృతీయ రోజు బంగారమే ఎందుకు కొంటారు అంటే బంగారం కేవలం అలంకరణ కోసమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు బంగారం ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బంగారం విలువ ఏళ్ల తరబడి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అందుకే ఈ రోజు మిగతా వస్తువుల కంటే బంగారం ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. అంతే కాకుండా ఈ రోజు బంగారం కొంటే అదృష్టం కలుగుతుంది అని విశ్వాసం.
అక్షయ తృతీయ పూజావిధానం
Akshaya Tritiya రోజు
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పీట మీద
పసుపు, బియ్యం, రూపాయి నాణెలతో ఒక
కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు ఉంచి
దానిపై పసుపు వినాయకుడని ప్రతిష్టించాలి. అక్షింతలతో వినాయకుడిని పూజించిన తరువాత
ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. కొత్త బట్టలనూ, బంగారాన్నీ
కలశం ముందు ఉంచి నైవేద్యంగా చెక్కెర పొంగలి పెట్టి, లక్ష్మీఅష్టోత్తరం
చదవాలి. సకల సంపదలకు మూలామైన లక్ష్మీదేవిని యధాశక్తి పూజించడం వలన సకల సౌభాగ్యాలూ
కలుగుతాయి.
కనీసం ఒక గ్రాము బంగారం అయిన అక్షయ తృతీయ రోజున కొంటే, వారింట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుంది అని అందరి విశ్వాసం. ఇది కొంత వరకూ నిజమే, ఈ రోజున ఎంతో కొంత బంగారాన్ని కొని లక్ష్మీదేవి పటం దగ్గర ఉంచి పూజ చేసి, ఆ బంగారాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దాని వలన వారి ఇంట్లో బంగారం అక్షయం అవుతుంది అని అంటారు. కానీ చాలా మంది బంగారం కొని పూజ చేస్తారు తప్ప బంగారం దానం మాత్రం చేయరు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత మూఖ్యమో దానం కూడా అంతే ముఖ్యం.
దానం చేయవలసినవి
నువ్వులు, మంచం, బట్టలు, కుంకుమ, గంథం, మారేడు దళాలు, కొబ్బరికాయ వంటివి దానం చేయవచ్చు.
మజ్జిగ దానం చేస్తే చదువులో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి
కలుగుతుంది. వెండి లేదా రాగి పాత్రలలో నీళ్లు పోసి దానిలో తులసి దళాలు లేదా మారేడు
దళాలు వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయని
శాస్ర్తాలు చెప్తున్నాయి. ఈ రోజు చెప్పులు లేని వారికి దానం చేస్తే స్వర్గానికి
వెళ్తారని పురాణాలు చెప్తున్నాయి.
పురాణంలో Akshaya Tritiya
మత్స్య పురాణంలో 65వ అధ్యాయం
ప్రకారం, శివుడు
పార్వతీ దేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు. వైశాఖ శుద్ధ తదియనాడు చేసే
వ్రతం, జపం హోమం, దానం లేక పుణ్యకార్యం
ఏదయినా దాని ఫలితము అక్షయమౌతుంది అని చెప్పాడు. కేవలం పుణ్యకార్యాల వల్ల వచ్చే
ఫలితం అక్షయం అవటమే కాకుండా, పాపకార్యాల వల్ల వచ్చే పాపం
కూడా అక్షయమే అవుతుంది.
వేదవ్యాసుడు ఈ రోజునే మహా భారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా
ఆయన మహా భారతాన్ని రాయడం మెదలు పెట్టాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు
ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను ఇచ్చాడు. మహాభారతంలో ద్రౌపది వస్ర్తాపహరణం
జరిగినది అక్షయ తృతీయ రోజే. ఆ సమయంలో ద్రౌపది శ్రీ కృష్ణుడిని ప్రార్థించగా
చివరలేని చీరలను ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు. కుబేరుడు అక్షయ తృతీయ
రోజున లక్ష్మీదేవిని పూజించి సంపదకు అధిపతి అయ్యాడు.
![]() |
కుచేలుడికి సేవ చేస్తున్న కృష్ణుడు |
కృతయుగం ప్రారంభమైంనది కూడా వైశాఖ శుద్ధ తదియ రోజున అని పురాణాలు
చెబుతున్నాయి. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది. ప్రజలు సౌభాగ్యాలతో
బతికిన యుగం అది. అలాంటి కృతయుగం మొదలైన రోజు Akshaya Tritiya కాబట్టి శుభదినంగా
చాలా మంది భావిస్తారు. నిరుపేద అయిన కుచేలుడు బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుడి
కటాక్షంతో అక్షయ సంపదలను పొందిన రోజు కూడా ఈ రోజే. నరసింహ స్వామి ప్రహ్లాదుడిని
అనుగ్రహించిన రోజు కూడా ఈరోజే. ఇన్ని మంచి విషయాలు ఈ అక్షయ తృతీయ నాడు జరిగాయి
కాబట్టి రాహుకాలాల ప్రస్తావన ఉండదు. బంగారం సహా ఏవి కొనుగోలు చేసినా సమయం
చూసుకోవలసిన అవసరం లేదు. ఏ సమయంలో అయినా కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు ప్రతి క్షణం
మంచి ముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున చాలా
మంది అక్షరాభ్యాసం చేయిస్తారు.
ఎలాంటి పనులు చేపట్టవచ్చు
అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యం
అయిన వారం, వర్జ్యం,
రాహుకాలం, యమగండం వంటి వాటితో సంబంధం లేకుండా జరుపుకోవచ్చునని
పురోహితులు చెబుతారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను
ఆరంభించవచ్చు. మొదటిసారి పిల్లలను బడిలో చేర్చడం, పుస్తకావిష్కరణ,
పుణ్యస్థలాలను సందర్శించడం వంటి కార్యాలను చేయవచ్చు. విలువైన వస్తువులను కొనడం వలన సంపద
రెట్టింపు అవుతుందని నమ్ముతారు. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి
స్థలాలు కొనడం, బోర్ వేయడం వంటి పలు శుభకార్యాలను
ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి అని నమ్ముతారు. ఈ రోజున ఏ పని మొదలు పెట్టిన అది విజయవంతం
అవుతుందని నమ్ముతారు. కాబట్టే విలువైన
వస్తువులు, మరి ముఖ్యంగా బంగారం కొంటారు. కొంత మంది ఈ రోజున
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.
ఈ రోజే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సిరి సంపదలకు రక్షకుడిగా నియమితుడైనాడు. బంగారాన్ని మించిన సంపద ఇంకొకటి లేదు. ఈ రోజే లక్ష్మి దేవిని విష్ణువు వివాహం చేసుకున్నాడు. క్షీరసాగర మధనం తరువాత విష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు. Akshaya Tritiya రోజున లక్ష్మీదేవిని బంగారు నగలతో అలంకరించి పూజచేస్తే సంపదలు కలుగుతాయని విశ్వాసం.